JC Prabhakar Reddy: తాడిపత్రిలో భద్రతా వివాదం: పెద్దారెడ్డి నుంచి డబ్బులు వసూలు చేయాలన్న జేసీ

JC Prabhakar Reddy Questions Free Security for Ketireddy Pedda Reddy
షార్ట్స్‌లో చూడండి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కల్పిస్తున్న పోలీసు భద్రతపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతకు అయ్యే ఖర్చును పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదంటూ పట్టణ పోలీసులకు ఆయన లేఖ రాయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పెద్దారెడ్డికి ముఖ్యమంత్రి స్థాయి బందోబస్తును ఉచితంగా కల్పిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జేసీ తన లేఖలో ఆరోపించారు. "ఆయనకు భద్రత కావాలనుకుంటే, నిబంధనల ప్రకారం రుసుము చెల్లించాలి. అలా చెల్లించని పక్షంలో బందోబస్తును వెంటనే ఉపసంహరించుకోవాలి" అని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు చలానా రూపంలో పెద్దారెడ్డి నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయలేదని ఆయన ఆరోపించారు.

కేవలం లేఖతోనే ఆగకుండా, పెద్దారెడ్డి నుంచి డబ్బులు వసూలు చేయకుండా భద్రత కొనసాగిస్తే పోలీసులకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు, ఈ చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ న్యాయవాది అనీఫ్ భాష సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం ఈ వివాదానికి మరింత బలాన్నిచ్చింది.

గతంలో తాను తాడిపత్రికి వెళ్లే సమయంలో భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులను కోరారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం భద్రతకు అయ్యే ఖర్చును డిపాజిట్ చేయాలని పోలీసులు సూచించగా, అందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. అయితే, ఆ చెల్లింపు జరిగిందా? లేదా? అన్నదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 
Go Back to Shorts
JC Prabhakar Reddy
Tadipatri
Ketireddy Pedda Reddy
Andhra Pradesh Politics
Police Security
Anantapur District
Security Charges
RTI Act
Political Controversy
Municipal Chairman

More Telugu News