అటవీ సిబ్బందిపై ఏనుగు దాడి.. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్
- పలమనేరులో జనవాసాల్లోకి ప్రవేశించిన ఒంటరి ఏనుగు
- అడవిలోకి తరిమే క్రమంలో ఇద్దరు అటవీ సిబ్బందిపై దాడి
- గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్న పవన్
- ఏనుగుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశం
- అవసరమైతే కుంకీ ఏనుగులతో గస్తీ నిర్వహించాలని సూచన
శనివారం చిరుతపల్లి అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగు దారి తప్పి పలమనేరు పట్టణ సమీపంలోని జనావాసాల్లోకి ప్రవేశించింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు కలిసి ఏనుగును తిరిగి అడవిలోకి పంపేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఏనుగు ఒక్కసారిగా వారిపైకి ఎదురుదాడికి దిగింది. ఈ ఘటనలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) సుకుమార్, ఏనుగుల ట్రాకర్ హరిబాబులకు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ, సిబ్బంది ధైర్యంగా వ్యవహరించి ఏనుగును విజయవంతంగా అడవిలోకి మళ్లించారు.
ఈ విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గాయపడిన సుకుమార్, హరిబాబుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావుకు ఫోన్లో సూచించారు. "ఏనుగుల కదలికలపై రానున్న కొన్ని రోజుల పాటు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. వాటి కదలికలను నిశితంగా గమనించాలి. ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాలి" అని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైతే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులతో గస్తీ నిర్వహించాలని కూడా ఆయన సూచించారు.