Narendra Modi: 'ఆపరేషన్ సిందూర్'లో మన ఆయుధాలే మనల్ని కాపాడాయి: నరేంద్ర మోదీ

Narendra Modi says Indian weapons saved us in Operation Sindoor
  • ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారికి మన సైన్యం గుణపాఠం చెప్పిందన్న ప్రధాని
  • దేశ రక్షణకు తయారీ రంగం చాలా ముఖ్యమన్న మోదీ
  • మణిపూర్ సైనికుల త్యాగాలను కొనియాడిన ప్రధాని
దేశంలో తయారైన ఆయుధాలే 'ఆపరేషన్ సిందూర్' సమయంలో దేశాన్ని కాపాడాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం కనబరిచిన ధైర్యసాహసాలను, నైపుణ్యాన్ని ఆయన ప్రశంసించారు. శనివారం మిజోరం రాజధాని ఐజ్వాల్, మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో జరిగిన సభల్లో ప్రధాని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఆపరేషన్ సిందూర్' ద్వారా మన సైనికులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు. ఈ ఆపరేషన్‌లో మన సైన్యం ప్రదర్శించిన శక్తిని, పరాక్రమాన్ని యావత్ ప్రపంచం చూసిందని తెలిపారు. "ఈ విజయంలో 'మేడ్ ఇన్ ఇండియా' ఆయుధాలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. దేశ భద్రతకు మన ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగం బలోపేతం కావడం చాలా ముఖ్యం" అని మోదీ వివరించారు. దేశం గర్వపడేలా మన సైనికులు పాకిస్థాన్ సైన్యంపై నిర్ణయాత్మక దెబ్బ తీశారని ఆయన పేర్కొన్నారు.

ఇంఫాల్‌లోని చారిత్రక కాంగ్లా కోటలో జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ, మణిపూర్‌కు చెందిన ఎందరో బిడ్డలు దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. 'ఆపరేషన్ సిందూర్'లో మణిపూర్ వీరుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. ఈ ఆపరేషన్‌లో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ దీపక్ చింగ్‌ఖామ్ ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. దీపక్ చింగ్‌ఖామ్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మోదీ ఉద్ఘాటించారు.

బీఎస్ఎఫ్ 7వ బెటాలియన్‌ కు చెందిన 25 ఏళ్ల దీపక్ చింగ్‌ఖామ్, జమ్ములోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద మే 10న జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరుసటి రోజు అసువులు బాసినట్లు ప్రభుత్వం గతంలో వెల్లడించింది. ఆయనతో పాటు మణిపూర్‌కే చెందిన స్క్వాడ్రన్ లీడర్ రిజ్వాన్ మాలిక్‌కు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'వీర్ చక్ర' పురస్కారాన్ని ప్రకటించారు. ఈ ఇద్దరు వీరులకు మణిపూర్ ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున బహుమతిని కూడా ప్రకటించింది.
Narendra Modi
Operation Sindoor
Indian Army
Manipur
Aizawl
Deepak Chingkham
Rizwan Malik

More Telugu News