Narendra Modi: బుద్ధి మార్చుకోని పాక్... ప్రధాని మోదీకి, ఆర్మీ చీఫ్ కు మధ్య విభేదాలంటూ ఫేక్ ప్రచారం

Narendra Modi Pakistan Spreads Fake News of Rift Between Modi and Army Chief
షార్ట్స్‌లో చూడండి
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయంటూ పాకిస్థాన్ ఆధారిత సోషల్ మీడియా ఖాతాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇది పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పాకిస్థాన్ పన్నుతున్న కుట్రలో భాగమేనని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.

పాకిస్థాన్‌తో వివాదం పెట్టుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా లేదని, సైనిక సామగ్రిని ఆధునికీకరించకుండా ప్రభుత్వం ఒత్తిడి తేవడంపై సైన్యాధికారులు అసంతృప్తితో ఉన్నారంటూ కొన్ని 'ఎక్స్' ఖాతాల నుంచి ఒకే తరహా సందేశాలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ పోస్టులన్నీ పాకిస్థాన్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయని గుర్తించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెంటనే రంగంలోకి దిగింది. భారత ప్రభుత్వం, సైన్యం మధ్య ఐక్యతను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ కల్పిత ప్రచారానికి తెరలేపారని తేల్చిచెప్పింది.

గతంలో 'ఆపరేషన్ సిందూర్' సమయంలో కూడా పాకిస్థాన్ ఇలాంటి అసత్య ప్రచారాలకే పాల్పడిందని, ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తోందని పీఐబీ గుర్తు చేసింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఇలాంటి నిరాధారమైన సమాచారాన్ని నమ్మవద్దని, ఏదైనా వార్తను నిర్ధారించుకోవడానికి అధికారిక మాధ్యమాలను ఆశ్రయించాలని ప్రజలకు సూచించింది. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రజల్లో గందరగోళం సృష్టించే ఇలాంటి ప్రయత్నాల పట్ల పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Go Back to Shorts
Narendra Modi
Indian Army
Pakistan propaganda
Upendra Dwivedi
PIB Fact Check
Operation Sindoor
India Pakistan relations
social media disinformation
fake news India
Indian government

More Telugu News