GV Anjaneyulu: జగన్‌ వైఖరి కారణంగా రాయలసీమలో వైసీపీకి ఒక్క ఓటు కూడా రాని పరిస్థితి నెలకొంది: జీవీ ఆంజనేయులు

GV Anjaneyulu Says Jagan Will Not Get A Single Vote In Rayalaseema
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని, ఆయన పాలనలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. జగన్ వైఖరి కారణంగా రాయలసీమలో ఆయనకు ఒక్క ఓటు కూడా లభించని పరిస్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో లేకపోయినా వైసీపీ కుట్ర రాజకీయాలు మానడం లేదని, రైతుల ముసుగులో అన్నదాతలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో కృత్రిమంగా యూరియా సంక్షోభాన్ని సృష్టించి, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనాలని ఆయన సవాల్ విసిరారు. వారు సభకు వస్తే, రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేకంగా గంట సమయం కేటాయించేందుకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఆయన ప్రశంసించారు. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మార్చుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరని కొనియాడారు. కరవు పీడిత రాయలసీమలో కియా వంటి అంతర్జాతీయ కార్ల కంపెనీని నెలకొల్పి, యువతకు ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. హంద్రీనీవా కాలువల ద్వారా సీమ పొలాలకు నీరందించి, ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని గుర్తుచేశారు.

మరోవైపు, రానున్న రోజుల్లో రాయలసీమలో వైసీపీ ఉనికి కోల్పోవడం ఖాయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
GV Anjaneyulu
Rayalaseema
YSRCP
Jagan
Chandrababu Naidu
Andhra Pradesh Politics
TDP
AP Government
Amilineni Surendrababu
Yuria crisis

More Telugu News