YCP: నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ పోరుబాట.. అనుమతి లేదన్న పోలీసులు.. వైసీపీ నేతల గృహనిర్బంధాలు

YCPs Statewide Protest Today Amid Police Restrictions
షార్ట్స్‌లో చూడండి
రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ వైసీపీ ఇవాళ తలపెట్టిన 'అన్నదాత పోరు' కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పలు జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని జిల్లాల్లోని ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులు, రైతు సంఘాలతో కలిసి ధర్నాలు చేయాలని నిర్ణయించింది. నిరసనల అనంతరం అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని కూడా పార్టీ శ్రేణులకు సూచించింది.

అయితే, ఈ నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో, ఆందోళనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ ఉదయం నుంచే పలువురు వైసీపీ ముఖ్య నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు.

పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా, నిర్బంధాలు విధించినా సరే 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రైతుల పక్షాన తమ గళాన్ని వినిపిస్తామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
Go Back to Shorts
YCP
YSRCP
Andhra Pradesh
Farmers protest
AP Politics
RDO office
Jagan Mohan Reddy
YSR Congress Party
Farmers issues
House arrest

More Telugu News