Bandi Sanjay: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay to Celebrate Hyderabad Liberation Day Grandly
  • సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం
  • ఈసారి వేడుకలు మరింత ఘనంగా నిర్వహిస్తామని కేంద్రం ప్రకటన
  • మన్ కీ బాత్'లో ఆపరేషన్ పోలోను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
  • సర్దార్ పటేల్ చొరవతోనే నిజాం పాలన నుంచి విముక్తి
  • తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది
  • ప్రధాని వ్యాఖ్యలపై బండి సంజయ్, కిషన్ రెడ్డి హర్షం
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈసారి అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో చారిత్రక 'ఆపరేషన్ పోలో'ను గుర్తుచేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోయిన హైదరాబాద్ సంస్థానాన్ని ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అతి తక్కువ సమయంలోనే 'ఆపరేషన్ పోలో' ద్వారా భారతదేశంలో విలీనం చేశారని సంజయ్ గుర్తుచేశారు.

ఆదివారం ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' ప్రసంగం అనంతరం కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా స్పందించారు. "సెప్టెంబర్‌లో వచ్చే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఆపరేషన్ పోలోలో పాలుపంచుకున్న వీరులందరినీ స్మరించుకుందాం" అని బండి సంజయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అంతకుముందు, తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజల స్వేచ్ఛ కోసం సర్దార్ పటేల్ నేతృత్వంలో జరిగిన ఆపరేషన్ పోలోను, సాయుధ బలగాల ధైర్యసాహసాలను కొనియాడారు. "1947 ఆగస్టులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ ప్రజలు మాత్రం 1948 సెప్టెంబర్ 17 వరకు వేచి చూడాల్సి వచ్చింది. నిజాం, రజాకార్ల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోయాయి. త్రివర్ణ పతాకం ఎగరేయడం, 'వందేమాతరం' పలకడం కూడా ప్రాణాల మీదకు తెచ్చేది. పేదలు, మహిళలు తీవ్ర అణచివేతకు గురయ్యారు," అని ప్రధాని నాటి పరిస్థితులను వివరించారు.

పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన సర్దార్ పటేల్, ఈ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకుని 'ఆపరేషన్ పోలో'కు రూపకల్పన చేశారని మోదీ తెలిపారు. రికార్డు సమయంలో మన సాయుధ దళాలు హైదరాబాద్‌ను నిజాం చెర నుంచి విడిపించి, భారతదేశంలో విలీనం చేశాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ ప్రసంగానికి సంబంధించిన వాయిస్ రికార్డును కూడా ప్రధాని వినిపించారు.

హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారని ప్రధాని మోదీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. కాగా, సెప్టెంబర్ 17వ తేదీని ఏటా 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా జరపాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే నిర్ణయం తీసుకుని, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Bandi Sanjay
Hyderabad Liberation Day
Operation Polo
Sardar Vallabhbhai Patel
Narendra Modi
Telangana
Hyderabad
Man Ki Baat
G Kishan Reddy

More Telugu News