రోగులను పరీక్షిస్తుండగా గుండెపోటు.. తమిళనాడులో హృద్రోగ నిపుణుడి మృతి
- ఆసుపత్రిలో కుప్పకూలిన వైద్యుడికి సహచరుల చికిత్స
- కాపాడేందుకు విఫలయత్నం చేసిన వైద్యులు
- విధినిర్వహణలో ఒత్తిడే కారణం కావొచ్చంటున్న నిపుణులు
చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ (39) కార్డియాక్ సర్జన్ గా సేవలందిస్తున్నారు. బుధవారం రాత్రి ఆసుపత్రిలో విధుల్లో ఉన్నారు. హృద్రోగ వార్డులోని పేషెంట్లను పరీక్షిస్తుండగా రాయ్ గుండెపోటుకు గురయ్యారు. అకస్మాత్తుగా కుప్పకూలిన డాక్టర్ రాయ్ ను వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని.. గ్రాడ్లిన్ రాయ్ ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
హృద్రోగాలపై పూర్తి అవగాహన కలిగిన కార్డియాక్ సర్జన్ అదే గుండెపోటుతో మరణించడంపై వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రాడ్లిన్ రాయ్కు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవని ఆయన సహచర వైద్యుడు సుధీర్ కుమార్ పేర్కొన్నారు. వైద్యులు రోజుకు 12-18 గంటలు పనిచేయాల్సి వస్తుందని, అందువల్ల వారిపై ఒత్తిడి అధికంగా ఉంటుందని అన్నారు. రాయ్ మరణానికి ఇదే కారణమై ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.