PM Modi: టోక్యోలో ప్రధాని మోదీ.. పెట్టుబడులే ప్రధాన అజెండా

Prime Minister Modi Lands In Tokyo
షార్ట్స్‌లో చూడండి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శుక్రవారం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో ప్రధాని మోదీ కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాల కారణంగా భారత్-అమెరికా సంబంధాలు కొంత మందగించిన నేపథ్యంలో ప్రధాని మోదీ జపాన్ పర్యటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. పర్యటన తొలి రోజైన శుక్రవారం జరిగే చర్చల్లో భారత్‌లో పెట్టుబడుల లక్ష్యాన్ని రెట్టింపు చేసేందుకు జపాన్ హామీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా మోదీ జపాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో కూడా సమావేశం కానున్నారు.

పర్యటన రెండో రోజైన శనివారం, ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ఇషిబాతో కలిసి హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్‌లో సెందాయ్ నగరానికి ప్రయాణిస్తారు. అక్కడ వారు ఒక సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని సందర్శించనున్నారు. జపాన్ పర్యటన ముగించుకున్న అనంతరం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) వార్షిక సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారు.
Go Back to Shorts
PM Modi
India Japan summit
Shigeru Ishiba
India Japan relations
Tokyo visit
India investments
Trade agreements
SCO summit
Semiconductor manufacturing
High speed bullet train

More Telugu News