బీహార్ లో రేవంత్ రెడ్డికి పనేంటి?.. ప్రశాంత్ కిషోర్ ఫైర్
- రాహుల్ గాంధీ బీహార్ పర్యటనలో రేవంత్ రెడ్డి
- తెలంగాణ సీఎంపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఆగ్రహం
- బీహార్ గ్రామాల్లోకి వస్తే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరిక
- బీహారీల డీఎన్ఏపై రేవంత్ పాత వ్యాఖ్యల ప్రస్తావన
- రేవంత్ ను వెంట తిప్పుకోవడంపై రాహుల్ పైనా విమర్శలు
రాహుల్ గాంధీ 'ఓటర్ అధికార్ యాత్ర' చేపట్టడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. కానీ, గతంలో బీహారీల డీఎన్ఏలోనే కూలీలుగా పనిచేయడం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిని వెంటబెట్టుకుని తిరగడం సరికాదన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి బీహార్లోని గ్రామాల్లో పర్యటిస్తే, అక్కడి ప్రజలే ఆయన్ను తరిమి కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ వేదిక పంచుకోవడంపై మీడియా ప్రశ్నించగా, ప్రశాంత్ కిషోర్ మరింత ఘాటుగా స్పందించారు. "అసలు బీహార్ కు రేవంత్ రెడ్డి ఏం చేశారు? ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం?" అని ఆయన నిలదీశారు. అలాంటి వ్యక్తిని రాహుల్ గాంధీ ఇంకా తన పక్కన పెట్టుకుంటున్నారంటే, అది ఆయన మానసికతను తెలియజేస్తోందని పీకే విమర్శించారు.
ఈ వ్యాఖ్యల అనంతరం, రేవంత్ రెడ్డి పర్యటనపై తన వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేస్తూ ప్రశాంత్ కిషోర్ మీడియా సమావేశాన్ని ముగించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, బీహార్ లో రేవంత్ ఉనికిని పీకే తీవ్రంగా వ్యతిరేకించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.