2026లో తమిళనాడులో చరిత్ర సృష్టిస్తాం: నటుడు విజయ్
- మధురై సభను విజయవంతం చేసిన మద్దతుదారులకు విజయ్ కృతజ్ఞతలు
- విమర్శల్లోని మంచిని మాత్రమే స్వీకరించి ముందుకు సాగుతామని వెల్లడి
- విభజన శక్తులకు, కపట రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టీకరణ
- 1967, 1977 నాటి చారిత్రక తీర్పు 2026లో పునరావృతమవుతుందని ధీమా
- పని మాత్రమే రాజకీయాల మాతృభాష అని కీలక వ్యాఖ్య
మధురై సభను చరిత్రలో ఒక కీలక మలుపుగా అభివర్ణించిన విజయ్, సభకు తరలివచ్చిన జనసందోహాన్ని చూసి తన హృదయం గర్వంతో, ఆనందంతో నిండిపోయిందని తెలిపారు. "సముద్రమంతా మధురైలో కలిసినట్టుగా ప్రజలు తరలివచ్చారు. ఇంతటి ప్రేమను పొందడానికి నేనేం తపస్సు చేశానో అర్థం కావడం లేదు. మీరంతా నా కుటుంబంగా దొరికినందుకు ఆ భగవంతుడికి, ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా" అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
తమ రాజకీయాలు ఎల్లప్పుడూ విభజన శక్తులకు, ప్రభుత్వంలోని కపట నాటకాలకు వ్యతిరేకంగానే ఉంటాయని విజయ్ స్పష్టం చేశారు. "మా స్పష్టమైన, రాజీలేని వైఖరిని ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఇకపై ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతాం. ఎందుకంటే, పనే రాజకీయాల మాతృభాష" అని ఆయన అన్నారు. తమపై వచ్చే విమర్శల నుంచి కేవలం మంచిని మాత్రమే స్వీకరించి, ప్రతికూలతలను చిరునవ్వుతో తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సమావేశం విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమించిన పార్టీ ఆఫీస్ బేరర్లు, కోఆర్డినేటర్లు, కార్యకర్తలకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. తమ రాజకీయాలు ప్రజాస్వామ్య విలువలు, నిజాయతీ పునాదులపై ప్రజా కేంద్రకంగానే సాగుతాయని ఆయన పునరుద్ఘాటించారు. స్వచ్ఛమైన, ప్రజల కోసం పనిచేసే రాజకీయ అధికారాన్ని సాధించి తీరుతామని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.