అధికారిక లాంఛనాలతో సురవరం అంతిమయాత్ర... రేవంత్ రెడ్డి ఆదేశం
- ప్రస్తుతం కేర్ ఆసుపత్రి మార్చురీలో ఉన్న సురవరం భౌతికకాయం
- రేపు ఉదయం మఖ్దూం భవన్ కు తరలింపు
- అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి అంతిమయాత్ర
రేపు ఉదయం 9 గంటలకు గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి నుంచి సురవరం భౌతికకాయాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయమైన మఖ్దూం భవన్కు తరలిస్తారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.
మధ్యాహ్నం 3 గంటలకు మఖ్దూం భవన్ నుంచి గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. ఊరేగింపు ప్రారంభానికి ముందు ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు ఆయన పార్థివ దేహానికి గౌరవ వందనం సమర్పిస్తారు. సాయంత్రం 5 గంటలకు వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం సురవరం పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలు పార్టీల నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.