India China border dispute: భారత్-చైనా వాణిజ్యం.. సరిహద్దుపై నేపాల్ అభ్యంతరంపై తీవ్రంగా స్పందించిన భారత్

India Rejects Nepals Objection on China Border Trade
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ ద్వారా చైనాతో సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడంపై నేపాల్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత్ తీవ్రంగా ఖండించింది. నేపాల్ వాదనలకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏకపక్షంగా భూభాగాలను తమవని చెప్పుకోవడం సరికాదని గట్టిగా బదులిచ్చింది.

ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, "ఈ విషయంలో మా వైఖరి చాలా స్పష్టంగా, స్థిరంగా ఉంది. లిపులేఖ్ పాస్ ద్వారా భారత్, చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం 1954లోనే ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. ఇటీవల కోవిడ్, ఇతర కారణాల వల్ల వాణిజ్యానికి అంతరాయం కలిగింది. ఇప్పుడు దాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి" అని తెలిపారు.

"ఇక భూభాగాలపై వాదనల విషయానికొస్తే, వాటికి ఎలాంటి చారిత్రక వాస్తవాలు, ఆధారాలు లేవు. ఏకపక్షంగా, కృత్రిమంగా భూభాగాలను విస్తరించుకుంటూ చేసే వాదనలు నిలబడవు" అని ఆయన అన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి నేపాల్‌తో నిర్మాణాత్మక చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉందని జైస్వాల్‌ స్పష్టం చేశారు.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన సందర్భంగా లిపులేఖ్ పాస్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని షిప్కి లా, సిక్కింలోని నాథూ లా పాస్‌ల ద్వారా వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే నేపాల్ విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. లింపియధుర, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు తమ దేశ అంతర్భాగమని, తమ నూతన మ్యాప్‌లో వాటిని చేర్చామని, దీనికి రాజ్యాంగబద్ధత కూడా ఉందని నేపాల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే నేపాల్ వాదనలను భారత్ కొట్టిపారేసింది.
Go Back to Shorts
India China border dispute
Lipulekh Pass
Nepal India relations
Randhir Jaiswal
Wang Yi

More Telugu News