S Jaishankar: భారత్‌లో మరింత విస్తరించండి: రష్యా కంపెనీలకు జైశంకర్‌ ఆహ్వానం

S Jaishankar Invites Russian Companies to Expand in India
షార్ట్స్‌లో చూడండి
అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు, భౌగోళిక రాజకీయ సవాళ్ల నడుమ భారత్, రష్యాలు కలిసికట్టుగా కొత్త మార్గాలను అన్వేషించాలని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్న తరుణంలో, ఆయన మాస్కోలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా రష్యా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు.

మాస్కోలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్‌తో జై శంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థికం, సాంకేతికత, సాంస్కృతిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు ఇరు దేశాలు సృజనాత్మకంగా ఆలోచించి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని జై శంకర్ గుర్తుచేశారు. 'మేక్ ఇన్ ఇండియా' వంటి కార్యక్రమాల ద్వారా విదేశీ పెట్టుబడులకు, వాణిజ్యానికి తమ ప్రభుత్వం కొత్త ద్వారాలు తెరిచిందని వివరించారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని, రష్యా కంపెనీలు భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవాలని సూచించారు.

ఈ ఏడాది చివరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో, అందుకు సంబంధించిన సన్నాహక చర్యలలో భాగంగానే జైశంకర్ పర్యటన కొనసాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందనే బలమైన సంకేతాన్ని ఈ పర్యటన ఇస్తోంది. ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్, రష్యాలు ఇరు దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. ఆయిల్ అమ్మకాలపై భారత్ కు తాజాగా 5 శాతం డిస్కౌంట్ ను రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Go Back to Shorts
S Jaishankar
India Russia relations
Russia investment in India
Make in India program
Denis Manturov
Vladimir Putin India visit
India Russia trade
India foreign policy
Russia India oil imports
India Russia cooperation

More Telugu News