అమరావతిలో పులస చేపలు పడతాం: రాజధానిపై వైసీపీ నేతల సెటైర్లు
- రాజమండ్రి జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో వైసీపీ నేతల భేటీ
- అమరావతిలో రెండేళ్లలో పులసలు పడతామన్న కేతిరెడ్డి
- గోదావరిలా అమరావతిలో వరద పొంగుతోందంటూ విమర్శలు
రాబోయే రెండు, మూడేళ్లలో అమరావతిలో పులస చేపలు పడతాయని, వాటిని పట్టి అందరికీ పంచిపెడతామని కేతిరెడ్డి ఎద్దేవా చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్రెడ్డితో నిన్న కేతిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి ములాఖత్ లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీరు అమరావతిపై విమర్శలు గుప్పించారు.
గోదావరి పొంగినట్టు ఇప్పుడు అమరావతిలో వరద పొంగుతోందని కేతిరెడ్డి సెటైర్ వేశారు. ఇదే సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, తాము దమ్మున్న వాళ్లమని, తమ పార్టీ కూడా దమ్మున్న పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించినా, ఎదుర్కొని గెలవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నీటి ముంపు ముప్పు ఉన్న అమరావతిలో రాజధానిని నిర్మిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.