Narendra Modi: జమ్ము కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్ పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Narendra Modi Expresses Grief Over Jammu Kashmir Cloudburst
షార్ట్స్‌లో చూడండి
జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో గురువారం సంభవించిన  క్లౌడ్ బరస్ట్ (కుంభవృష్టి), ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర విపత్తులో 38 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రధాని భరోసా ఇచ్చారు.

“కిష్ట్వార్ వరద బాధితులందరికీ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికోసం ప్రార్థిస్తున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తాం” అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

కిష్ట్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఈ విపత్తు సంభవించడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతం అత్యంత దుర్గమంగా ఉండటంతో, క్షతగాత్రులను హెలికాప్టర్ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

సమాచారం అందిన వెంటనే సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలు స్థానిక యంత్రాంగంతో కలిసి రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వైద్య సహాయం అందించడం వంటి పనులను ముమ్మరంగా చేపట్టాయి. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
Narendra Modi
Kishtwar
Jammu Kashmir
Cloudburst
Floods
Landslide
Natural Disaster
NDRF
SDRF

More Telugu News