గంభీర్ చెప్పిన ఆ ఒక్క మాటతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది: టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్
- ఇంగ్లండ్ పర్యటనలో అద్భుత ప్రదర్శనపై స్పందించిన ఆకాశ్ దీప్
- నా సామర్థ్యంపై నాకంటే కోచ్ గంభీర్కే ఎక్కువ నమ్మకమన్న పేసర్
- అసలు నీ సత్తా ఏంటో నీకే తెలియదంటూ తనను గౌతీ ప్రోత్సహించాడని వెల్లడి
- కెప్టెన్ శుభ్మన్ గిల్ అండగా నిలవడం ఎంతో ధైర్యాన్నిచ్చిందని వ్యాఖ్య
- వ్యక్తిగత జీవితంలోని సవాళ్లను, సంతోషాలను పంచుకున్న యువ ఫాస్ట్ బౌలర్
ఇటీవల ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాశ్ దీప్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా హెడ్ కోచ్ గంభీర్ గురించి మాట్లాడుతూ, "గంభీర్ భాయ్ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆయన నన్ను ఎంతగా నమ్ముతారంటే, నా బౌలింగ్, బ్యాటింగ్ సామర్థ్యాలపై నాకే అంత నమ్మకం ఉండదు" అని అన్నాడు. ఓవల్లో తాను 66 పరుగులు చేసిన తర్వాత గంభీర్ తన వద్దకు వచ్చి, "నీ సత్తా ఏంటో నీకే తెలియదు. చూశావా, నువ్వు ఇది చేయగలవని నేను చెప్పాను. ఇదే అంకితభావంతో ఎప్పుడూ ఆడాలి" అని అన్న మాటలను గుర్తుచేసుకున్నాడు. ఆ మాటలు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని తెలిపాడు.
కెప్టెన్ శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుతూ, "గిల్ చాలా మంచి కెప్టెన్. అతను కొత్త కెప్టెన్ ఏమీ కాదు. ఇప్పటికే ఐపీఎల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు కెప్టెన్ మనల్ని అర్థం చేసుకుని మద్దతు ఇస్తే ఎంతో ధైర్యంగా ఉంటుంది. గిల్ కెప్టెన్సీలో నేను తొలిసారి ఆడుతున్న ఫీలింగే కలగలేదు" అని వివరించాడు.
ఇంగ్లండ్ పర్యటన తనకిదే తొలిసారి అయినా, అక్కడి పరిస్థితులు పెద్దగా ఇబ్బంది పెట్టలేదని ఆకాశ్ దీప్ చెప్పాడు. "మేము ఆడిన ఐదు టెస్టుల్లో నాలుగు మ్యాచ్లలో పిచ్లు ఇంగ్లండ్లో ఉన్నట్లు అనిపించలేదు. బంతి పెద్దగా స్వింగ్, సీమ్ అవ్వకపోవడంతో భారత పిచ్లపై వేసే లెంగ్త్లోనే బంతులు వేయాల్సి వచ్చింది. అది మాకు కలిసి వచ్చింది" అని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ పర్యటనకు ముందు తన సోదరికి క్యాన్సర్ అని తెలియడం తన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆకాశ్ దీప్ భావోద్వేగానికి గురయ్యాడు. పర్యటన ముగిశాక నేరుగా లక్నో వెళ్లి సోదరిని కలిశానని, తన ప్రదర్శన ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు. ఈ పర్యటన అనంతరం తాను కలలుగన్న లగ్జరీ కారును కొనుగోలు చేశానని, అయితే ఈ ఆనందాల కంటే తనకు క్రికెట్టే ముఖ్యమని, దానిపైనే తన పూర్తి దృష్టి ఉంటుందని స్పష్టం చేశాడు.