మొదటి పెళ్లి దాచి రెండో పెళ్లి.. చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్!
- ముహూర్తానికి కొన్ని గంటల ముందు మొదటి భార్యతో పరారీ
- అప్పటికే వివాహమైన విషయం దాచిపెట్టిన వైనం
- కేసు పెడతానని మొదటి భార్య హెచ్చరించడంతో పలాయనం
- వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన మోసం
- తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో ఘటన
పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పాలి సత్యనారాయణకు, గోపాలపురం మండలం భీమోలుకు చెందిన ఓ యువతితో సోమవారం తెల్లవారుజామున వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఏర్పాట్లన్నీ ఘనంగా జరిగాయి. అయితే, ఆదివారం సాయంత్రం వరుడు సత్యనారాయణ కనిపించడం లేదని అతని బంధువులు వధువు తరఫు వారికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు వెంటనే దేవరపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు.
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సత్యనారాయణకు ఐదేళ్ల క్రితమే భర్త చనిపోయిన ఓ మహిళతో వివాహం జరిగిందని తెలిసింది. అంతేకాదు, ఆ మహిళ కుమార్తెకు కూడా సత్యనారాయణే దగ్గరుండి పెళ్లి జరిపించాడని వధువు బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో, రెండో పెళ్లి విషయం తెలుసుకున్న మొదటి భార్య, ఆదివారం సత్యనారాయణకు ఫోన్ చేసి తనను మోసం చేస్తే కేసు పెడతానని తీవ్రంగా హెచ్చరించింది. దీంతో భయపడిపోయిన సత్యనారాయణ, రెండో పెళ్లిని రద్దు చేసుకుని ఆమెతో కలిసే పారిపోయాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని, మోసపోయిన పెళ్లి కుమార్తెకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.