Asim Munir: అసిమ్ మునీర్ అణు వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన.. అది వారికి పరిపాటేనని కౌంటర్

India On Asim Munir Comments
షార్ట్స్‌లో చూడండి
అమెరికా గడ్డపై నుంచి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేసిన అణు బెదిరింపులపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అణు ప్రగల్భాలు పలకడం పాకిస్థాన్‌కు పరిపాటి అని, మిత్ర దేశం భూభాగం నుంచి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం విచారకరమని సోమవారం భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా నగరంలో పాకిస్థానీ సంతతి ప్రజలతో జరిగిన ఒక సమావేశంలో అసిమ్ మునీర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. భవిష్యత్తులో భారత్‌తో యుద్ధం జరిగి, తమ దేశ మనుగడకే ముప్పు వాటిల్లితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. "మేము అణ్వస్త్ర దేశం. మేం మునిగిపోతున్నామని అనిపిస్తే, మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకుపోతాం" అని మునీర్ హెచ్చరించినట్లు సమాచారం.

ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. "ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యల విషయంలో అంతర్జాతీయ సమాజం తన సొంత నిర్ధారణకు రాగలదు. ఉగ్రవాద గ్రూపులతో అంటకాగే పాకిస్థాన్ సైన్యం చేతిలో అణ్వాయుధాల నియంత్రణ, భద్రత ఎంత వరకు పటిష్టంగా ఉందనే దానిపై ఉన్న సందేహాలను ఈ వ్యాఖ్యలు మరింత బలపరుస్తున్నాయి" అని విదేశాంగ శాఖ తెలిపింది. ఇలాంటి అణు బ్లాక్‌మెయిల్‌కు లొంగే ప్రసక్తే లేదని, దేశ జాతీయ భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది.

మరోవైపు, పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన ఒక బాధ్యతారహిత దేశమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా మద్దతు లభించినప్పుడల్లా పాకిస్థాన్ సైన్యం తన అసలు స్వరూపాన్ని బయటపెడుతుందని, ఇది ఎప్పటినుంచో జరుగుతున్నదేనని వ్యాఖ్యానించాయి. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం లేదని, అంతా సైన్యం నియంత్రణలోనే ఉందని ఈ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయని, ఆ దేశంలోని అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే నిజమైన ప్రమాదం ఉందని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

సింధు నది జలాలపై భారత్ ఏదైనా ఆనకట్ట నిర్మిస్తే, దానిని పది క్షిపణులతో ధ్వంసం చేస్తామని కూడా మునీర్ హెచ్చరించారు. తమ వద్ద క్షిపణుల కొరత లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
Go Back to Shorts
Asim Munir
Pakistan
India
nuclear weapons
Indian Foreign Ministry
nuclear threat
terrorism
missiles
national security
America

More Telugu News