నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు ..
- దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్న వాతావరణ కేంద్రం
- ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్న ఐఎండీ
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారులు
ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న (బుధవారం) అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేసింది.
11వ తేదీ సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 12న కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 13న గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఆగస్టు 14న ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.