ఆధారాలు చూపించు, లేదంటే క్షమాపణ చెప్పు: బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్
- ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బండి సంజయ్పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
- 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్
- లేకపోతే పరువునష్టం దావా వేస్తానని తీవ్ర హెచ్చరిక
- త్వరలోనే లీగల్ నోటీసులు పంపుతామని వెల్లడి
- బండికి కనీస పరిజ్ఞానం కూడా లేదంటూ ఘాటు విమర్శలు
కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాజకీయ లబ్ధి కోసమే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం ఉన్నా బయటపెట్టాలని సవాల్ విసిరారు. కేవలం తన ఢిల్లీ బాస్లను మెప్పించడం కోసమే బండి సంజయ్ ఇలాంటి వీధి డ్రామాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ తీరుపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తికి ఇంటెలిజెన్స్ పనితీరుపై కనీస అవగాహన అటుంచి, సాధారణ పరిజ్ఞానం కూడా లేదు. ఆయన వ్యాఖ్యలు హద్దులు మీరుతున్నాయి" అని విమర్శించారు. "ఢిల్లీ బాస్ల చెప్పులు మోసినంత సులభం కాదు బాధ్యతాయుతమైన మంత్రి పదవిని నిర్వహించడం," అంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ చేస్తున్న అసత్య ప్రచారాలు ఆయన స్థాయిని మరింత దిగజార్చుతున్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.