Ponguru Narayana: చంద్రబాబుపై గౌరవంతో సింగపూర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది: ఏపీ మంత్రి నారాయణ

Ponguru Narayana Says Singapore Consortium Not Coming to Amaravati Startup Projects
  • సింగపూర్ సంస్థల కన్సార్షియం ఒప్పందాలను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్న మంత్రి నారాయణ
  • సింగపూర్ సంస్థలను సీఐడీ అధికారులతో వేధించిందన్న మంత్రి 
  • సీఎం చంద్రబాబు చొరవతో సింగపూర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వివరణ  
  • సాంకేతిక సహకారం అందిస్తామన్నారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్విస్ ఛాలెంజ్ విధానంలో స్టార్టప్ ప్రాజెక్టుల విషయంలో ముందుకు రాలేమని సింగపూర్ సంస్థల కన్సార్షియం స్పష్టం చేసిందని, అయితే సాంకేతిక సహకారం అందిస్తామని వెల్లడించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అంతే కాకుండా ఇతర ప్రాజెక్టుల్లో పాలుపంచుకోవడానికి హామీ ఇచ్చిందని చెప్పారు. సింగపూర్‌లో వ్యర్థాల నిర్వహణకు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించామని మంత్రి తెలిపారు.

ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన మంత్రి నారాయణ నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణాలపై 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం సింగపూర్ సంస్థల కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందాలను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడమే కాకుండా సీఐడీ అధికారులను సింగపూర్ పంపి, ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకున్న సంస్థలను విచారణ పేరుతో వేధించిందని మండిపడ్డారు. సీఐడీ అధికారుల విచారణతో సింగపూర్ ప్రభుత్వం తీవ్ర వేదనకు గురయిందని తెలిపారు.

అయితే, సింగపూర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య స్నేహపూర్వక బంధం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆ దేశ పర్యటనకు వెళ్లి అధ్యక్షుడిని, సీనియర్ మంత్రులను కలిసి చర్చించారని చెప్పారు. చంద్రబాబుపై గౌరవంతో వారు ఎంతో సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రానికి కావాల్సిన మద్దతు అందిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి నారాయణ వివరించారు. 
Ponguru Narayana
Amaravati
Andhra Pradesh
Singapore Consortium
Startup Projects
Swiss Challenge
Waste Management
Chandrababu Naidu
CID Investigation
Singapore Government

More Telugu News