Varanasi Ropeway: త్వరలో వారణాసిలో అర్బన్ రోప్ వే ప్రారంభం... హైదరాబాద్ సంస్థ ఘనత!

Varanasi Ropeway to Open Soon Built by Hyderabad Company
  • దేశంలో మొట్ట మొదటి అర్బన్ రోప్ వే వారాణాసిలో పూర్తి 
  • ఆగస్టులో ప్రారంభం కానున్న వైనం!
  • రోప్ వే నిర్మాణ పనులు పూర్తి చేసిన హైదరాబాద్‌కు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ
భారతదేశంలోనే మొట్టమొదటి అర్బన్ రోప్‌వే ప్రాజెక్ట్‌గా వారణాసి రోప్‌వే త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మార్చి నెల నుంచే రోప్‌వే టెస్ట్ రన్‌లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ రోప్‌వే ప్రాజెక్టు ఆగస్టు నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఓ తెలుగు సంస్థ పనితనం ఉండడం విశేషం. 

ప్రాజెక్ట్ వివరాలు
నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLMCL) ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.815 కోట్లు. 2023 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.

ప్రత్యేకతలు
ఈ రోప్‌వే ప్రాజెక్టు ద్వారా నగరంలో ప్రజా రవాణా మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలకు ఇది సులభమైన పరిష్కారం. ప్రయాణ సమయం: గోడౌలియా నుండి కాంట్ రైల్వే స్టేషన్‌కు కేవలం 16 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా 150 గోండోలాలు 45-50 మీటర్ల ఎత్తులో నడుస్తాయి. ఒక్కో గోండోలాలో గరిష్ఠంగా 10 మంది ప్రయాణించే వీలుంటుంది. గంటకు 3 వేల మందిని రవాణా చేయగల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వారణాసిలో రద్దీని తగ్గించి, యాత్రికులు, పర్యాటకులకు సౌకర్యవంతమైన మరియు పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. ఈ రోప్‌వే ప్రారంభంతో వారణాసికి వచ్చే భక్తులకు, పర్యాటకులకు మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుందని ఆశిస్తున్నారు.
Varanasi Ropeway
Urban Ropeway Project
Kashi Ropeway
Vishva Samudra Engineering
NHLMCL
Narendra Modi
Uttar Pradesh Tourism
Godaulia
Cantt Railway Station
Public Transportation

More Telugu News