Bangladesh plane crash: ఢాకాలో విమాన ప్రమాదం.. టీచర్ భయానక అనుభవం!

Bangladesh Plane Crash Teachers Horrifying Experience in Dhaka
  • ఢాకాలో స్కూల్‌పై కూలిన శిక్షణ విమానం
  • 19 మంది మృత్యువాత.. మృతులందరూ చిన్నారులే
  • నేడు బంగ్లాదేశ్‌లో జాతీయ సంతాప దినం
"నా పిల్లలను తీసుకోవడానికి స్కూల్ గేట్ వద్దకు వెళ్లాను. ఒక్కసారిగా ఏదో వెనుక నుంచి వచ్చినట్లు అనిపించింది. తిరిగి చూసేసరికి, ఒక భారీ పేలుడు శబ్దం... కేవలం మంటలు, దట్టమైన పొగ మాత్రమే కనిపించాయి!".. ఢాకాలోని మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీలో ఉపాధ్యాయుడైన మసూద్ తారిక్ చెప్పిన మాటలివి. నిన్న మధ్యాహ్నం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఒక శిక్షణా విమానం (ఎఫ్-7బీజీఐ) ఈ స్కూల్‌పైన కుప్పకూలడంతో యావత్ బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. ఈ హృదయ విదారక ఘటనలో కనీసం 19 మంది మరణించగా, 164 మందికి పైగా గాయపడినట్టు సైనిక అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం ఈ విషాదాన్ని మరింత తీవ్రం చేసింది.

క్షణాల్లో మారిన విధి.. పైలట్ ప్రయత్నం విఫలం
నిన్న మధ్యాహ్నం 1:06 గంటలకు ఢాకాలోని కుర్మిటోలా ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి రొటీన్ శిక్షణ విమానంగా బయలుదేరిన ఈ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. పైలట్, ఫ్లైట్ లెఫ్టినెంట్ మొహమ్మద్ తౌకీర్ ఇస్లామ్ విమానాన్ని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి మళ్లించి తక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయత్నించారు. కానీ, దురదృష్టవశాత్తూ విమానం మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీలోని రెండు అంతస్తుల భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ కూడా మరణించినట్టు బంగ్లాదేశ్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) తెలిపింది.

17 మంది చిన్నారులు మృతి
మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీలో 4 నుంచి 18 సంవత్సరాల వయసు గల విద్యార్థులు చదువుకుంటారు. బడికి ఆనందంగా వెళ్లిన చిన్నారులు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కలచివేసింది. ఈ ఘటనలో మరణించిన వారిలో 17 మంది చిన్నారులే ఉన్నారని బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. గాయపడిన 164 మందిలో 43 మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు, అంబులెన్స్‌ల సహాయంతో గాయపడిన వారిని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (సీఎంహెచ్), సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లోని బర్న్ యూనిట్ హెడ్ బిధాన్ సర్కార్ మాట్లాడుతూ ఒక మూడో తరగతి విద్యార్థిని మరణించిన స్థితిలో తీసుకొచ్చారని, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు.

ఓరి దేవుడా.. ఇది నా స్కూలేనా!
ప్రమాద తీవ్రతకు ప్రత్యక్ష సాక్షులు భయంతో వణికిపోయారు. "వీడియోలు చూస్తుంటే భయం వేసింది. ఓరి దేవుడా! ఇది నా స్కూలేనా!" అని 16 ఏళ్ల విద్యార్థిని రఫీఖా తాహా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రమాదం తర్వాత స్కూల్ ఆవరణంలో భారీ మంటలు, దట్టమైన పొగ కమ్ముకున్నాయి. ఫైర్ సర్వీస్ సిబ్బంది విమాన శిథిలాలపై నీటిని చల్లి మంటలను అదుపు చేశారు. విమానం ఢీకొన్న భవనంలోని ఇనుప గ్రిల్స్ పూర్తిగా ధ్వంసమై, పెద్ద రంధ్రం ఏర్పడింది. ప్రమాదంపై  బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు ముహమ్మద్ యూనస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నేడు బంగ్లాదేశ్‌లో ఒక రోజు జాతీయ సంతాప దినం ప్రకటించారు. దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు.

బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రమాద కారణాలను గుర్తించడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. గాయపడినవారికి అత్యుత్తమ చికిత్స, సహాయం అందిస్తున్నామని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన వైమానిక ఘటనగా నిలిచి, దేశ ప్రజలను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది.
Bangladesh plane crash
Dhaka plane crash
Masood Tarik
Milestone School and College
Bangladesh Air Force
Mohammad Toukir Islam
Kurmitola Air Force Base
Bangladesh children death
plane accident
F-7BG1

More Telugu News