దొంగచాటుగా మామిడికాయలు తెచ్చి రోడ్డుపై పోసి తొక్కించడమే వైసీపీ వాళ్ల సంస్కారం: నాదెండ్ల మనోహర్
- ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులకు తెలుసన్న మంత్రి నాదెండ్ల మనోహర్
- ధాన్యం సొమ్ము వంద శాతం రైతుల ఖాతాల్లోకి జమ చేశామని వెల్లడి
- రైతుల పక్షాన నిజాయితీగా ప్రశ్నించే తత్వం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరిన నాదెండ్ల
ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులకు తెలుసని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. 2024-25లో ధాన్యం సొమ్ము వంద శాతం రైతుల ఖాతాల్లోకి జమ చేశామని, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు.
కేవలం ఫోటోలు, వీడియోల కోసం వైసీపీ నేతలు మామిడి పంటను ట్రాక్టర్ తో తొక్కించడం దుర్మార్గమని మంత్రి అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం, పోలీసులతో పాటు వ్యవస్థలో ఉన్న వ్యక్తులను బెదిరించడం సరికాదని, రైతు పక్షాన నిజాయితీగా ప్రశ్నించే తత్వం ఉంటే చర్చకు రావాలని మంత్రి నాదెండ్ల సవాల్ విసిరారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.