Nara Lokesh: ఏపీ రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టండి... ప్రెస్టీజ్ గ్రూప్‌కు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం

Nara Lokesh Invites Prestige Group to Invest in AP Real Estate
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు బెంగళూరులో ప్రెస్టీజ్ గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాయాద్ నౌమాన్‌లతో లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రస్తుతం పూర్తి అనుకూల వాతావరణం ఉందని ఈ సందర్భంగా ఆయన వారికి వివరించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లోకేశ్ వారికి వివరిస్తూ, "సుమారు రూ.65 వేల కోట్ల వ్యయంతో అమరావతి రాజధాని పనులు వేగంగా సాగుతున్నాయి. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. మరోవైపు రాయలసీమలో రిలయన్స్, రెన్యూ వంటి సంస్థలు గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి" అని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలోనే వివిధ సంస్థలు రాష్ట్రంలో రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయని ఆయన గుర్తుచేశారు. ఏపీలో 'ప్లగ్ అండ్ ప్లే' పద్ధతిలో మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని లోకేశ్ కోరారు.

మంత్రి విజ్ఞప్తిపై ప్రెస్టీజ్ గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను తప్పకుండా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, దేశంలోని 13 ప్రధాన నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ప్రెస్టీజ్ గ్రూప్ ఇప్పటివరకు 350కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో క్రిసిల్ డీఏ1+ రేటింగ్ పొందిన ఏకైక భారతీయ సంస్థ ఇదే కావడం గమనార్హం.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
Prestige Group
Real Estate Investments
Amaravati
Visakhapatnam
IT Hub
Irfan Razack
Jayaud Nouman
AP Investments

More Telugu News