Celebi: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. టర్కీ సంస్థకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ

Celebi Suffers Setback in Delhi High Court Operation Sindoor Effect
షార్ట్స్‌లో చూడండి
దేశంలోని విమానాశ్రయాల్లో సేవలు అందిస్తున్న టర్కీ సంస్థ 'సెలెబి'కి ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ సంస్థకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) రద్దు చేసిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను పునరుద్ధరించాలని కోరుతూ సెలెబి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ నిర్ణయమే సరైనదని స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేవలం దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొనే సెలెబి సంస్థ క్లియరెన్స్‌ను రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు. కేంద్రం వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

అంతకుముందు, తమకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా బీసీఏఎస్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని సెలెబి తరఫు న్యాయవాది వాదించారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 3,800 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, భారత విమానయాన రంగంలో పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్ 'ఆపరేషన్ సిందూర్‌' చేపట్టిన సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ డ్రోన్లు, క్షిపణులను అందించి మద్దతుగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో 'బాయ్‌కాట్ టర్కీ' నినాదం జోరందుకున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన చర్యలు తీసుకుంది. దేశంలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు, పలు యూనివర్సిటీలు కూడా టర్కీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.
Go Back to Shorts
Celebi
Celebi Ground Handling
Delhi High Court
Operation Sindoor

More Telugu News