Virat Kohli: నా యవ్వనాన్ని, నా అనుభవాన్ని, నా విధేయతను ఈ జట్టుకు అంకితం చేశా.. కోహ్లీ ఎమోష‌న‌ల్‌!

Virat Kohli Reacts to Royal Challengers Bangalore IPL Title Win
షార్ట్స్‌లో చూడండి
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఉత్కంఠభరిత క్షణాలకు వేదికైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సుదీర్ఘకాలంగా ఊరిస్తున్న ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు సొంతం చేసుకుంది. ఏకంగా 18 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టుపై జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో ఆర్సీబీ 6 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. త‌ద్వారా మొట్టమొదటిసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం జట్టు సభ్యుల్లో, ముఖ్యంగా జట్టుకు వెన్నెముకగా నిలిచిన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీలో తీవ్ర భావోద్వేగాలను రేకెత్తించింది.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్‌కు 191 పరుగుల సవాలుతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు ప్రతి పరుగుకూ శ్రమించాల్సి వచ్చింది. ఒక దశలో శశాంక్ సింగ్ కేవలం 30 బంతుల్లో అజేయంగా 61 పరుగులు చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ, ఆర్సీబీ బౌలర్లు ఒత్తిడిని జయించి క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఆఖ‌రి ఓవర్‌ను అత్యంత కట్టుదిట్టంగా వేసిన జోష్ హేజిల్‌వుడ్, బెంగళూరుకు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఫ్రాంచైజీ ఆరంభం నుంచి ఆర్సీబీ జట్టుకు ప్రతీకగా నిలిచిన విరాట్ కోహ్లీ, విజయం ఖరారైన వెంటనే మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యాడు. గతంలో మూడుసార్లు ఫైనల్స్‌లో ఓటమిపాలైన జట్టులో సభ్యుడిగా, కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకి ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఈ విజయం యొక్క ప్రాముఖ్యతను గ్రహించిన అతను భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. అభిమానులు, మాజీ క్రికెటర్లు ఈ చారిత్రక విజయంలో పాలుపంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... ఈ విజయాన్ని ఆర్సీబీ అశేష అభిమానులకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. జట్టుతో తనకున్న సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. "ఈ విజయం జట్టు సభ్యులదే కాకుండా, 18 ఏళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులది కూడా. నా యవ్వనాన్ని, నా అనుభవాన్ని, నా విధేయతను ఈ జట్టుకు అంకితం చేశాను. ఈ క్షణం నాకు సర్వస్వం" అని కోహ్లీ ఉద్వేగంగా చెప్పాడు. 

ఇంకా మాట్లాడుతూ... "నా హృదయం బెంగళూరుతోనే ఉంది, నా ఆత్మ బెంగళూరుతోనే ఉంది. నేను ఈ జట్టుకే విధేయుడిగా ఉన్నాను. వేరే ఆలోచనలు వచ్చినప్పటికీ, నేను వారితోనే ఉన్నాను. వారు నాతోనే ఉన్నారు. ఇక విజ‌యంలో గ‌త కొన్నేళ్లు నాతో పాటు ఆడిన ఏబీ డివిలియ‌ర్స్‌, క్రిస్ గేల్ కు కూడా ఉంది. వారు కూడా జ‌ట్టు కోసం చాలా ఏళ్లు ఎంతో చేశారు" అని కోహ్లీ తన మనసులోని మాటను పంచుకున్నాడు.

ఈ విజయం ఆర్సీబీ జట్టుకే కాకుండా, కోహ్లీ ఐపీఎల్ కెరీర్‌లో కూడా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. సుదీర్ఘకాలంగా అందని ద్రాక్షలా ఊరించిన ఐపీఎల్ టైటిల్, చివరకు వారి వశమైంది. ఆధునిక క్రికెట్‌లోని గొప్ప ఆటగాళ్లలో ఒకడైన విరాట్ కోహ్లీ కల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఆర్సీబీ మద్దతుదారుల ఆకాంక్ష ఈ విజయంతో నెరవేరింది.
Go Back to Shorts
Virat Kohli
RCB
Royal Challengers Bangalore
IPL Win
IPL 2024
Josh Hazlewood
Punjab Kings
Shashank Singh
AB de Villiers
Chris Gayle

More Telugu News