Mohammad Yunus: చైనా పెట్టుబడులే మా ఆర్థిక వ్యవస్థకు కీలకం: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్
- చైనాతో కలిసి పని చేస్తామన్న మహమ్మద్ యూనస్
- బంగ్లాదేశ్ లో భారీగా పెట్టుబడులు పెట్టాలని విన్నపం
- చైనా-బంగ్లా వాణిజ్యం, పెట్టుబడుల సదస్సులో యూనస్ కీలక వ్యాఖ్యలు
చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే తమ దేశ ఆర్థిక వ్యవస్థలో గొప్ప మార్పు వస్తుందని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ అన్నారు. చైనా-బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులే ప్రధాన అంశంగా జరిగిన ఓ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చైనా వాణిజ్యశాఖ మంత్రి వాంగ్ వెంటావో ఈ సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనస్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగంలో చైనా కంపెనీలు మంచి పేరు సంపాదించాయని కొనియాడారు. చైనాతో కలిసి పనిచేయడానికి బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తమ దేశంలో చైనా భారీగా పెట్టుబడులు పెడితే, దేశ ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని యూనస్ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడం, చట్టాలను సరళీకరించడం, వ్యాపార కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధం బలపడుతున్న తరుణంలో ఈ సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని చైనా కంపెనీలకు సూచించిన ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మహమ్మద్ యూనస్ ఇటీవల చైనా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా ఆయన సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించేందుకు చైనా నుంచి పెట్టుబడులను మరింతగా పెంచాలని ఆ భేటీలో యూనస్ విజ్ఞప్తి చేశారు. తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టు (టీఆర్సీఎంఆర్పీ)లో పాలుపంచుకోవడానికి చైనా కంపెనీలను బంగ్లాదేశ్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. చైనా ఇస్తున్న రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని, ఆ దేశ నిధులతో నడుస్తున్న ప్రాజెక్టులకు కమిట్మెంట్ ఫీజును రద్దు చేయాలని, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం.