Karnataka: కర్ణాటకలో దారుణం.. బేకరీలో వ్యక్తి దారుణ హత్య.. సీసీటీవీలో రికార్డయిన భయానక దృశ్యాలు!

Man Murdered With Machetes By 7 Inside Bakery In Karnataka
  • కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో బేకరీలో వ్యక్తి దారుణ హత్య
  • మే 31న జరిగిన ఘటన.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
  • మృతుడు చెన్నప్ప నారినాల్‌గా గుర్తింపు
  • పాత కక్షలు, ఆస్తి వివాదమే హత్యకు కారణమని ప్రాథమిక అంచనా
  • ఏడుగురు నిందితుల కోసం పోలీసుల గాలింపు
కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మే 31వ తేదీన ఏడుగురు దుండగులు ఓ వ్యక్తిని అత్యంత కిరాత‌కంగా న‌రికి చంపేశారు. ఈ దారుణమంతా ఆ బేకరీలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. ఆస్తి తగాదాల కారణంగా జరిగిన ఈ హత్య, ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళనలను లేవనెత్తింది.

పోలీసుల కథనం ప్రకారం... మృతుడిని చెన్నప్ప నారినాల్ గా గుర్తించారు. ఏడుగురు వ్యక్తుల బృందం అతడిని వెంబడించింది. దాంతో చెన్న‌ప్ప‌ స్థానికంగా ఉన్న ఒక బేకరీలోకి ప‌రిగెత్తాడు. సీసీటీవీ ఫుటేజీలో అత‌డు ప్రాణభయంతో కేకలు వేస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు వ్యక్తులు కత్తులతో అతడిపై విచ‌క్ష‌ణ‌రాహితంగా దాడి చేయగా, మరో వ్యక్తి క‌ర్ర‌తో తలపై బలంగా కొట్టాడు. దాడిలో తీవ్రతంగా గాయ‌ప‌డిన చెన్న‌ప్ప అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.

కాగా, పాత కక్షలు, ఆస్తి వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. నిందితులకు, మృతుడికి మధ్య గత కొంతకాలంగా ఆస్తికి సంబంధించిన తగాదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సోషల్ మీడియాలో, స్థానిక ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం, అక్కడున్నవారు ఏమాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏడుగురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే, పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టపగలు, సీసీ కెమెరాల సాక్షిగా జరిగిన ఈ దాడి, సమాజంలో నెలకొన్న హింసాత్మక ధోరణులను, ముఖ్యంగా ఆస్తి వివాదాల కారణంగా తలెత్తుతున్న తీవ్ర పరిణామాలను మరోసారి స్పష్టం చేసింది.

More Telugu News

Karnataka
Karnataka murder
Koppal district
bakery murder
property dispute
CCTV footage
crime news
mob violence
police investigation
real estate feud