బెంగళూరులో మొదటి కొవిడ్ మరణం.. కర్ణాటకలో స్వల్పంగా పెరుగుతున్న కేసులు
- బెంగళూరులో మళ్లీ కరోనా మరణం నమోదు
- రాష్ట్రంలో 38కి చేరిన యాక్టివ్ కేసులు, అత్యధికం బెంగళూరులోనే
- ఆందోళన అవసరం లేదన్న ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు
- రద్దీ ప్రాంతాల్లో వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచన
- తీవ్ర శ్వాసకోశ సమస్యలున్నవారికి కరోనా పరీక్షలు తప్పనిసరి
రాష్ట్రంలో కరోనా కేసుల స్వల్ప పెరుగుదలపై ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందించారు. "ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది చాలా సాధారణ పరిస్థితి. గత 15 రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది" అని ఆయన శనివారం బెంగళూరులో మీడియాకు తెలిపారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు, ముఖ్యంగా ఆసుపత్రులలో ఉన్నవారు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణులు, పిల్లలు రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వీలైతే మాస్కు ధరించాలని సలహా ఇచ్చారు. అయితే, మాస్కు ధరించడం తప్పనిసరి కాదని, ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.
"కరోనా వైరస్ ఇప్పుడు మన వ్యవస్థలో ఒక భాగంగా మారిందని, ఇతర వైరస్ల మాదిరిగానే దీన్ని పరిగణించాలని" మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. తీవ్రమైన లక్షణాలు కనిపించనంత వరకు భయపడాల్సిన పనిలేదని, ప్రజలు సాధారణ జీవనం కొనసాగించవచ్చని ఆయన పేర్కొన్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటివి కరోనాతో పాటు ఇతర వ్యాధుల నివారణకు కూడా ఉపయోగపడతాయని ఆయన వివరించారు.