Telangana Police: తెలంగాణలో 77 మంది డీఎస్పీల బదిలీలు

Telangana Police Department Transfers 77 DSPs
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో సోమవారం భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డీజీపీ జితేందర్ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా కొందరికి నూతన పోస్టింగులు కేటాయించగా, మరికొందరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.

పోలీసు శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఈ బదిలీల్లో పలువురు కీలక అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవో)గా ఎన్. వెంకటస్వామి నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ విభాగం డీఎస్పీగా డి. రఘుచందర్‌కు బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్ నగరంలోని కీలక ప్రాంతాల్లో కూడా మార్పులు జరిగాయి. బాలానగర్ ఏసీపీగా పి. నరేశ్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా వి. శ్రీకాంత్ గౌడ్, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్, చిక్కడపల్లి ఏసీపీగా సీహెచ్ శ్రీకాంత్‌లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా, మేడ్చల్ ఏసీపీగా సీహెచ్ శంకర్ రెడ్డి, సంతోష్ నగర్ ఏసీపీగా సుఖ్‌దేవ్ సింగ్, మలక్‌పేట ఏసీపీగా సుబ్బరామిరెడ్డి, హుస్నాబాద్ ఏసీపీగా సదానందం, హైదరాబాద్ గాంధీనగర్ ఏసీపీగా ఏ. యాదగిరి బదిలీ అయ్యారు.

కొంతమంది అధికారులను ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో తక్షణమే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. వీరిలో చిక్కడపల్లి ఏసీపీగా పనిచేస్తున్న ఎల్. రమేశ్ కుమార్, మేడ్చల్ ఏసీపీ బి. శ్రీనివాస్ రెడ్డి, సంతోష్‌నగర్ ఏసీపీ ఎండీ గౌస్, మలక్‌పేట ఏసీపీ జి. శ్యామ్ సుందర్, హుస్నాబాద్ ఏసీపీ వి. సతీశ్‌లు ఉన్నారు. ఈ బదిలీలు పోలీసు శాఖలో సాధారణ పరిపాలన ప్రక్రియలో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Telangana Police
DSP Transfers
IPS Officers
Jitender
Hyderabad Police
Police Transfers Telangana
Telangana Government
Law and Order
New postings
Police Department

More Telugu News