'శంషాబాద్ విమానాశ్రయంలో ఉగ్రవాది పట్టివేత?' వీడియోపై స్పందించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో
- శంషాబాద్ విమానాశ్రయంలో ఉగ్రవాది పట్టివేత అంటూ ప్రచారం
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో దృశ్యాలు
- అది మాక్ డ్రిల్ వీడియో అని తేల్చిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోపై టీజీసీఎస్బీ అధికారులు ఫ్యాక్ట్ చెక్ నిర్వహించారు. ఆ పరిశీలనలో అది నకిలీ వీడియో అని తేలిందని వెల్లడించారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాపరమైన అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మాక్ డ్రిల్కు సంబంధించిన దృశ్యాలను కొందరు దురుద్దేశంతో ఉగ్రవాది పట్టివేత దృశ్యాలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని టీజీసీఎస్బీ పేర్కొంది. ఆ వీడియోలో కనిపిస్తున్నది భద్రతా బలగాలు మాక్ డ్రిల్లో భాగంగా చేస్తున్న విన్యాసాలేనని, నిజంగా ఉగ్రవాదిని పట్టుకున్న ఘటన కాదని వివరించారు.
ఈ నేపథ్యంలో, ప్రజలు ఆధారం లేని, అధికారికంగా ధృవీకరించని వార్తలను, వీడియోలను విశ్వసించవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచించారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని, వదంతులను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమాచారంపై అనుమానం ఉంటే, అధికారిక వర్గాల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు.