మంగళగిరి నియోజకవర్గంలో 'స్త్రీశక్తి' కాంతులు
- మహిళల స్వయం ఉపాధికి నారా లోకేశ్ ఆలోచన నుంచి పుట్టిన స్త్రీశక్తి పథకం
- ఇప్పటివరకూ 3,508 మంది మహిళలకు శిక్షణ
- లోకేష్ సొంత నిధులతో ఉచితంగా 3,508 కుట్టు మిషన్ల పంపిణీ
- అద్భుత పథకం అంటున్న లబ్ధిదారులు
2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అపజయం పాలైనా, తనను ఇంతగా ఆదరించిన ప్రజల మంచి చెడ్డలు చూడటం తన బాధ్యతగా భావించారు. తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే వారికి చేయూతను అందించేందుకు వివిధ వర్గాల సంక్షేమానికి ఏడు పథకాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేశారు.
చేనేతలు, స్వర్ణకారులు, మహిళలు, చిరువ్యా పారుల స్వయం ఉపాధికి తన సొంత నిధులతో పరికరాలు, సామాగ్రి, పెట్టుబడిగా అందజేశారు. తల్లి భువనేశ్వరి ఆశీస్సులు, భార్య బ్రాహ్మిణి ప్రోత్సాహంతో స్త్రీశక్తి పథకానికి రూపకల్పన చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో కుల, మతాలకు అతీతంగా ఆసక్తి గల మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ కోర్సు, టైలరింగ్ శిక్షణకు ఉద్దేశించిన స్త్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టారు.
మొత్తం నియోజకవర్గంలో ఇప్పటివరకూ 3,508 మందికి శిక్షణ పూర్తిచేసుకోగా, ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు అందజేశారు. వీరంతా ఇప్పుడు టైలరింగ్ షాపులు, ఇళ్లల్లోనూ టైలరింగ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మూడేళ్లుగా విజయవంతంగా నడుస్తున్న స్త్రీశక్తి పథకానికి ఖర్చు అయిన ప్రతీ రూపాయి నారా లోకేశ్ తన జేబులోంచి వెచ్చించడం గమనార్హం.

