Masood Azhar: "నేను కూడా చనిపోతే బాగుండేది"... కుటుంబ సభ్యులు చనిపోవడంపై స్పందించిన మసూద్ అజార్

Masood Azhars Response to Family Deaths in Operation Sindhu
  • పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్'
  • తన కుటుంబ సభ్యులు 10 మంది, నలుగురు అనుచరులు మృతిచెందారని జైషే చీఫ్ మసూద్ అజార్ ప్రకటన
  • బహావల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినట్లు వెల్లడి
  • మరణాన్ని ఉద్దేశిస్తూ, నా కుటుంబ సభ్యులు సంతోషాన్ని పొందారని వ్యాఖ్య
  • వారిలో తాను ఉంటే బాగుండేదన్న మసూద్ అజార్
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో తమ కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహిత అనుచరులు మరణించినట్లు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ కూడా పేర్కొన్నాడు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, జామియా మసీద్ సుభాన్ అల్లాపై జరిగిన ఈ దాడుల్లో మరణించిన వారిలో తన పెద్ద సోదరి, ఆమె భర్త, ఒక మేనల్లుడు, అతని భార్య, ఒక మేనకోడలు, ఇంకా తమ బంధువర్గానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని అజార్ ఒక ప్రకటనలో చెప్పాడని సమాచారం.

1994లో భారత్‌లో అరెస్టయి, అనంతరం ఎయిర్ ఇండియా ఐసీ 814 విమానం హైజాక్ ఘటన తర్వాత విడుదలైన మసూద్ అజార్, "ఈ రాత్రి నా కుటుంబంలోని పది మంది సభ్యులు ఈ సంతోషాన్ని (మరణాన్ని ఉద్దేశిస్తూ) పొందారు. వీరిలో ఐదుగురు అమాయక పిల్లలు, నా పెద్ద సోదరి, ఆమె గౌరవనీయులైన భర్త, నా మేనల్లుడు ఫాజిల్, అతని భార్య, నా ప్రియమైన మేనకోడలు (ఫాజిలా), నా ప్రియ సోదరుడు హుజైఫా, అతని తల్లి, మరో ఇద్దరు ప్రియ సహచరులు ఉన్నారు" అని పేర్కొన్నట్లు పీటీఐ పేర్కొంది. మరణించిన వారు అల్లా దర్బారుకు అతిథులుగా వెళ్లారని వ్యాఖ్యానించాడు.

విచారం లేదా నిరాశ లేదు.. నేనూ ఉంటే బాగుండేది

ఈ ఘటనపై తనకు ఎలాంటి విచారం గానీ, నిరాశ గానీ లేదని, పైగా ఈ పద్నాలుగు మంది సంతోషకరమైన యాత్రికుల బృందంలో నేనూ చేరి ఉంటే బాగుండేదని నా మనసు పదేపదే కోరుకుంటోంది అని అజార్ చెప్పినట్లుగా సమాచారం. "వారి నిష్క్రమణకు సమయం ఆసన్నమైంది, కానీ భగవంతుడు వారిని చంపలేదు" అంటూ అజార్ వ్యాఖ్యానించాడని, నేడు జరగనున్న అంత్యక్రియల ప్రార్థనలకు రావాల్సిందిగా ప్రజలను ఆహ్వానించాడని కూడా ఆ ప్రకటనలో ఉన్నట్లు పీటీఐ నివేదించింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన 56 ఏళ్ల మసూద్ అజార్, భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల కుట్రలో కీలక పాత్ర పోషించాడు. వీటిలో 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడి ముఖ్యమైనవి. ఈ ఉగ్రవాది పాకిస్థాన్‌లోనే ఉన్నాడన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ, అతని గురించి తమకు సమాచారం లేదని ఇస్లామాబాద్ పదేపదే ఖండిస్తూ వస్తోంది.
Masood Azhar
Jaish-e-Mohammed
Operation Sindhu
Family members killed
Pakistan
Terrorist attack
India
Bhawalpura
International terrorist
Counter-terrorism

More Telugu News