'ధోనీ' పేరుతో మిశ్రా పొరపాటు.. లైవ్లో సరిదిద్దిన సెహ్వాగ్
- ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్ చర్చలో ధోనీ ప్రస్తావన తెచ్చిన అమిత్ మిశ్రా
- వెంటనే మిశ్రాకు పాయింట్ గుర్తుచేసిన వీరేంద్ర సెహ్వాగ్
- ధోనీ పేరు మారుమోగడమే కారణమన్న మిశ్రా... డిబేట్ లో నవ్వులు
బుధవారం నాడు ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం జరిగిన చర్చా కార్యక్రమంలో అమిత్ మిశ్రా, వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, సన్ రైజర్స్ జట్టుకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఇంకా ఉన్నాయా అని మిశ్రాను ప్రశ్నించగా, అందుకు అతడు బదులిస్తూ జట్టు ప్రదర్శన మెరుగుపడాలని సూచించాడు.
"ఇది దాదాపు అసాధ్యం. వాళ్లు ఆడుతున్న తీరు చూస్తే మిగిలిన మ్యాచ్ లు గెలవడం కష్టం. అన్ని విభాగాల్లో రాణించాలి. ఒకవేళ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చి కనీసం 30 బంతులు ఆడాలి. టాప్ ఆర్డర్ ఇంకాస్త దూకుడుగా ఆడాలి" అని మిశ్రా వ్యాఖ్యానించారు.
మిశ్రా మాట్లాడుతుండగా సెహ్వాగ్ కలగజేసుకున్నారు. "ఇక్కడ ప్రశ్న ధోనీ గురించి లేదా సీఎస్కే గురించి అడగలేదు. సన్ రైజర్స్ గురించి అడిగారు" అని మిశ్రాకు గుర్తుచేశారు.
దీంతో అమిత్ మిశ్రా వెంటనే తేరుకుని, ప్యానల్కు క్షమాపణలు చెప్పారు. "క్షమించాలి, ఇప్పుడు అంతా ధోనీ పేరు ఎక్కువగా వినిపిస్తుండటంతో అలా పొరపాటున అనేశాను" అని చెప్పడంతో అక్కడ నవ్వులు విరిశాయి. రేపు (శుక్రవారం) సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.