కలిసి ఉండడం సాధ్యం కాదని కలిసి ఉరేసుకున్న ప్రేమజంట.. కరీంనగర్ జిల్లాలో విషాదం

Lovers Suicide In Karimnagar
 
పెద్దలు వేరే పెళ్లి చేసేందుకు ప్రయత్నించడంతో కరీంనగర్ జిల్లాలో ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. కలిసి జీవించడం సాధ్యం కాదనే ఆలోచనతో జంటగా ఉరేసుకుని చనిపోయారు. జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే.. చొప్పదండి మండలం చిత్యలపల్లికి చెందిన కొండపర్తి అరుణ్ కుమార్, భూపాలపట్నానికి చెందిన నాంపల్లి అలేఖ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అరుణ్ కుమార్ కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. విద్యాభ్యాసం పూర్తిచేసిన అలేఖ్య కొంతకాలంగా ఇంట్లోనే ఉంటోంది.

ఈ క్రమంలోనే అలేఖ్య తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో తమ ప్రేమ ఫలించదేమోనని, కలిసి జీవించడం సాధ్యం కాదని అరుణ్, అలేఖ్యలు ఆందోళన చెందారు. గురువారం నాడు కరీంనగర్ లోని తన మిత్రుడి ఇంటికి అలేఖ్యను తీసుకెళ్లిన అరుణ్ కుమార్ తనువు చాలించాలన్న నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లోని ఓ గదిలో ప్రేమికులిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అరుణ్, అలేఖ్యల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమికుల ఆత్మహత్యతో చిత్యలపల్లి, భూపాలపట్నం గ్రామాలలో విషాదం నెలకొంది.
Go Back to Shorts
Lovers
Suicide
Karimnagar
Marriage

More Telugu News