Maha Kumbh: పందులు, రాబందులు... కుంభమేళా విమర్శకులపై యోగి ఆదిత్యనాథ్ ఫైర్

Yogi Adityanath take a dig at Maha Kumbh critics
షార్ట్స్‌లో చూడండి
ఎల్లుండితో మహా కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో, ఈ అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంపై విమర్శలు చేస్తున్న వారిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిప్పులు చెరిగారు. కుంభమేళాపై అవాకులు, చెవాకులు పేలేవారు పందులు, రాబందులు అంటూ ధ్వజమెత్తారు. 

సున్నిత మనస్కులైన ప్రజలకు అందమైన అనుబంధం ఆవిష్కృతమైంది... వర్తకులకు మంచి వ్యాపారం లభించింది... భక్తులు పరిశుభ్రమైన ఏర్పాట్లు పొందారు... రాబందులకు శవాలు లభించాయి... పందులు బురదలో పొర్లాయి... అంటూ విపక్షాలను ఉద్దేశించి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేశారు. 

"మీరు (విపక్షాలు) కుంభమేళాకు ఓ కులాన్ని అనుమతించడంలేదని అంటున్నారు. ప్రత్యేకించి ఏ కులాన్ని కుంభమేళాకు వెళ్లకుండా అడ్డుకోలేదు. సదుద్దేశంతో కూడిన ఎవరైనా సరే కుంభమేళాకు గౌరవంగా వెళ్లొచ్చు. కానీ కుంభమేళాలో చిక్కులు సృష్టించాలన్న దురుద్దేశంతో వెళ్లేవారికి మాత్రం ఇక్కట్లు తప్పవు. 

మీలాగా మేమేమీ మత విశ్వాసాలతో ఆడుకోవడంలేదు. మీ హయాంలో కుంభమేళా నిర్వహించినప్పుడు కనీసం సమీక్షించడానికి కూడా ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. దానికితోడు ఓ సనాతనేతర వ్యక్తిని కుంభమేళా ఇన్చార్జిగా నియమించారు" అంటూ యోగి మండిపడ్డారు. 

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ అసెంబ్లీలో ఈ మేరకు యోగి తీవ్రస్థాయిలో స్పందించారు.
Go Back to Shorts
Maha Kumbh
Yogi Adityanath
Prayagraj
Uttar Pradesh

More Telugu News