మేయర్ పై అవిశ్వాసం గురించి చర్చించాం... ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్చించలేదు: తలసాని

Talasani on Greater BRS MLAs lunch meeting
  • తలసాని నివాసంలో కేటీఆర్ అధ్యక్షతన లంచ్ మీటింగ్
  • దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన సమావేశం
  • రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలని తలసాని డిమాండ్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేల లంచ్ మీటింగ్ ముగిసింది. జూబ్లీహిల్స్ లోని తలసాని నివాసంలో దాదాపు రెండున్నర గంటల సేపు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... ఇది పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన సమావేశమని చెప్పారు. అయితే, తాము రాజకీయ నాయకులం కాబట్టి రాజకీయ అంశాలపై కూడా చర్చించుకున్నామని తెలిపారు. 

జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టడంపై చర్చించుకున్నామని తలసాని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్చ జరగలేదని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాల్లో ప్రభుత్వ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పారు. రేషన్ కార్డులను అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. 

స్ట్రీట్ వెండర్స్ ని ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని... కానీ, ఇప్పుడు వారిని పూర్తిగా తొలగించేందుకు చూస్తోందని తలసాని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ గీత దాటితే... తాము కూడా గీత దాటాల్సి వస్తుందని హెచ్చరించారు. 

మరోవైపు, బీఆర్ఎస్ నేతల కుటుంబ వారసులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే అంశంపై కూడా లంచ్ మీటింగ్ లో చర్చించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Talasani
BRS

More Telugu News