25 ఏళ్ల క్రితం బంధువుల పెళ్లికి వెళ్లి తప్పిపోయిన మహిళ.. అంత్యక్రియలూ చేసేశారు.. కానీ బిగ్ ట్విస్ట్

Karnataka woman missing 25 years ago now found in Himachal Pradesh
  • 25 ఏళ్లక్రితం కర్ణాటకలో తప్పిపోయిన సాకమ్మ అనే మహిళ
  • హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం
  • ఇటీవల ఆ ఆశ్రమాన్ని సందర్శించిన ఓ యువ ఐపీఎస్ అధికారి
  • సాకమ్మ కన్నడలో మాట్లాడుతుండడాన్ని గుర్తించి కర్ణాటక ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన అధికారి
  • అడ్రస్ ట్రేస్ చేసిన ప్రభుత్వాధికారులు
  • ఇవాళ సొంతం రాష్ట్రానికి చేరుకోనున్న సాకమ్మ
ఓ మహిళ తన పిల్లలను వెంటబెట్టుకొని బంధువుల పెళ్లికి వెళ్లింది. తిరుగుపయనంలో ప్రమాదవశాత్తూ ఆమె వేరే రైలు ఎక్కింది. దీంతో తల్లీబిడ్డలు వేరయ్యారు. పిల్లలు ఇంటికి చేరుకోగా... ఆమె ఎక్కడికి వెళ్లిందో, ఏమైపోయిందో ఎంతకీ తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినా ఆచూకీ దొరకలేదు. ఎంతకీ జాడ తెలియకపోవడంతో ఆమె చనిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఇదంతా దాదాపు 25 ఏళ్ల క్రితం జరిగిపోయిన కథ. కానీ అనూహ్యంగా ఇవాళ (డిసెంబర్ 25) ఆ మహిళ తన కుటుంబ సభ్యులను కలవబోతోంది.

కర్ణాటకకు చెందిన సాకమ్మ అనే మహిళ 25 ఏళ్ల క్రితం తప్పిపోయింది. చాలా కాలం తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో ఆమె ఆచూకీ లభించింది. ఓ వృద్ధాశ్రమంలో ఆమె జీవనాన్ని వెళ్లదీస్తోంది. 

బళ్లారిలోని దాననాయకనకెరె గ్రామానికి చెందిన సాకమ్మ తన పిల్లలతో కలిసి హోసపేటలో ఉన్న తన బంధువుల పెళ్లికి వెళ్లింది. అయితే, ఆమె ప్రమాదవశాత్తూ చండీగఢ్‌కు వెళ్లే రైలు ఎక్కింది. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. తినడానికి తిండిలేక, ఒంటిమీద సరైన బట్టలేక చాలా కాలం తిరుగాడింది. ఆఖరికి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందింది.

ఒక యువ ఐపీఎస్ అధికారి ఆ వృద్ధాశ్రమాన్ని సందర్శించడంతో సాకమ్మ కథ ఊహించని మలుపు తిరిగింది. ఆమె కన్నడ భాషలో మాట్లాడుతుండడాన్ని గుర్తించిన ఆ అధికారి... కర్ణాటక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖను సంప్రదించారు. రంగంలోకి దిగిన అధికారులు ఆమె వివరాలు, అడ్రస్‌ను ట్రేస్ చేశారు. దీంతో ఇవాళే (బుధవారం) ఆమె తన కుటుంబం చెంతకు చేరబోతోంది. నేడు కర్ణాటక చేరుకోబోతోందని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Viral News
Off Beat
Karnataka
Himachal Pradesh

More Telugu News