Arvind Kejriwal: అతిశీ త్వరలోనే ఫేక్ కేసులో అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

Atishi to be arrested soon in fake case Kejriwal big claim
  • మహిళల కోసం తాము ప్రకటించిన పథకాలతో ఓర్వలేకపోతున్నారని విమర్శ
  • సీఎం అతిశీని అరెస్ట్ చేయడానికి ముందు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయన్న మాజీ సీఎం
  • మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానన్న ఆప్ చీఫ్
ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అతిశీని త్వరలోనే ఓ ఫేక్ కేసులో అరెస్ట్ చేయబోతున్నారని పేర్కొన్నారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రకటనలు చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని ‘ఎక్స్’ ద్వారా విమర్శలు గుప్పించారు. ఆప్ ప్రభుత్వ ఎజెండాను పట్టాలు తప్పించేందుకు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయని చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు చెప్పేందుకు నేటి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం పెడుతున్నట్టు చెప్పారు.

‘‘మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలపై గందరగోళం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఫేక్ కేసులో ముఖ్యమంత్రి అతిశీని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు. దానికంటే ముందు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయి’’ అని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. 

వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ఆప్ ప్రకటించింది. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన ‘లాడ్లీ బెహ్నా యోజన’ పథకాన్ని సవరించి ‘మహిళా సమ్మాన్ యోజన’ పేరుతో ఆప్ ఓ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మహిళకు రూ. 1000 అందిస్తుండగా, తాము అధికారంలోకి వస్తే రూ. 2,100 అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక, సంజీవని యోజన పథకంలో భాగంగా 60 ఏళ్లు, ఆపై వయసు కలిగిన ఢిల్లీ వాసుల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ఖర్చును భరిస్తుంది.
Arvind Kejriwal
AAP
Atishi
Delhi

More Telugu News