తుది వరకు నాది అదే మాట.. ఆరు రోజుల పని విధానంపై ఇన్ఫీ నారాయణమూర్తి మళ్లీ అవే వ్యాఖ్యలు!
- సీఎన్బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్లో నారాయణమూర్తి ప్రసంగం
- వారానికి ఐదు రోజుల పని విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇన్ఫోసిస్ కో ఫౌండర్
- దేశ ఆర్థిక పురోభివృద్ధికి కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం అవసరమన్న వైనం
- బలమైన పని విలువలు లేని దేశం పోటీ ప్రపంచంలో నిలబడ లేదన్న మూర్తి
అలసిపోని అంకితభావానికి ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఒక మోడల్ అని నారాయణమూర్తి ప్రశంసించారు. దేశ పురోగతికి కష్టపడి పనిచేయడం చాలా అవసరమని పేర్కొన్నారు. బలమైన పని విలువలు లేని దేశం పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతుందని హెచ్చరించారు. తాను విలువలతో ఎలా జీవించిందీ చెప్పుకొచ్చారు.
తన కెరియర్ మొత్తం సమయంతో సంబంధం లేకుండా పనిచేశానని వివరించారు. వారానికి ఆరు, ఆరున్నర రోజులపాటు రోజుకు 14 గంటలు పనిచేసేవాడినని గుర్తుచేసుకున్నారు. ఉదయం ఆరున్నర గంటలకు ఆఫీసుకు వెళ్తే మళ్లీ రాత్రి 8.40 గంటలకు ఆఫీసును విడిచిపెట్టేవాడినని తెలిపారు. తాను అలా పని చేసినందుకు గర్విస్తానని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. అలా పనిచేయడం తన వ్యక్తిగత ఎంపిక కాదని, అది బాధ్యత అని వివరించారు.