పూలకుండీలో గంజాయి మొక్కలు.. సోషల్ మీడియాలో పోస్టు చేసి అడ్డంగా బుక్కైన దంపతులు
- బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో దంపతుల నిర్వాకం
- పూల కుండీల్లో వివిధ మొక్కలతో పాటు గంజాయి మొక్కల సాగు
- కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు
సిక్కింకి చెందిన కె.సాగర్ గురుంగ్, ఊర్మిళ కుమారి దంపతులు బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. వీరు తమ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరు తమ బాల్కనీలోని పూల కుండీలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. రెండు కుండీల్లో గంజాయి మొక్కలు కూడా వేశారు. అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఊర్మిళ ఇటీవల పూల కుండీల వద్ద ఫోటో దిగి దాన్ని తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో పూల కుండీలో గంజాయి మొక్కల సాగు అంటూ ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.
పోలీసులు వచ్చే లోపుగా కుండీలోని గంజాయి మొక్కలను తీసివేయాలంటూ వెంటనే ఊర్మిళ బంధువు ఒకరు సూచించడంతో వారు అప్రమత్తమై గంజాయి మొక్కలను తీసేశారు. పోలీసులు వచ్చి తనిఖీ చేయగా, పూల కుండీలో గంజాయి మొక్కలు అయితే లేవు కానీ కుండీల్లో గంజాయి ఆకులను గుర్తించారు. 54 గ్రాములు ఉన్న గంజాయిని అక్కడి నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు గంజాయిని విక్రయిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విశ్లేషణ చేస్తున్నారు. ఆ దంపతులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.