ఏడేళ్ల పిల్లాడిని బలిచ్చిన స్కూలు యాజమాన్యం... యూపీలో ఘోరం

UP Class 2 Boy Sacrificed For Schools Success
ఉత్తరప్రదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. స్కూలు మరింత అభివృద్ధి చెందాలని తాంత్రిక పూజలు చేయించిన యాజమాన్యం... ఆ పూజలలో భాగంగా స్కూలులో చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్న ఏడేళ్ల పిల్లాడిని బలిచ్చింది. స్కూలు డైరెక్టర్, ఆయన తండ్రితో పాటు మరో ముగ్గురు టీచర్లు ఈ ఘోరానికి పాల్పడ్డారు. 

యూపీలోని హథ్రాస్ లో వారం కిందట జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్కూలు డైరెక్టర్, ఆయన తండ్రి, ముగ్గురు టీచర్లను అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే...

హథ్రాస్ జిల్లాలోని రస్ గావ్ గ్రామంలో డీఎల్ పబ్లిక్ స్కూల్ రెండో తరగతి చదువుతున్న ఓ బాలుడు వారం కిందట చనిపోయాడు. మీ అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడని హాస్టల్ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో తండ్రి కృష్ణన్ కుష్వాహ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే, బాలుడిని స్కూలు డైరెక్టర్ తండ్రి దినేశ్ బాఘెల్ తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్ చెప్పాడు. దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న కృష్ణన్ కు మీ కొడుకు చనిపోయాడని దినేశ్ బాఘెల్ చెప్పాడు. తన కారులో ఉన్న మృతదేహాన్ని అప్పగించాడు. అయితే, కొడుకు మరణంపై అనుమానంతో కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విచారణలో బయటపడ్డ ఘోరం..

పోలీసులు ప్రశ్నించగా దినేశ్ బాఘెల్ పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో దినేశ్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా బాలుడిని తామే చంపేసినట్లు ఒప్పుకున్నాడు. స్కూలు అభివృద్ధి కోసం తాంత్రిక పూజలు చేశామని, వాటిలో భాగంగా కృష్ణన్ కొడుకును బలిచ్చామని వివరించాడు. హాస్టల్ నుంచి బయటకు తీసుకెళుతుంటే బాలుడు ఏడ్చి కేకలు వేయడంతో కారులోనే చంపేసినట్లు తెలిపాడు. ఈ నెల 6న వేరే స్టూడెంట్ ను బలిచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యామని చెప్పాడు.
Go Back to Shorts
Student Murder
Uttar Pradesh
School Director
Black Magic
Crime News

More Telugu News