వాస్తవాలు మాట్లాడితే ఉగ్రవాది అంటారా?: షర్మిల
- రాహుల్ గాంధీని టెర్రరిస్టు అన్న బీజేపీ నేతలు
- విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ధర్నా
- బీజేపీ మతతత్వ పార్టీ అంటూ షర్మిల విమర్శలు
వీరి వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో షర్మిల, మస్తాన్ వలి, జేడీ శీలం, కొలనుకొండ శివాజి తదితరులు పాల్గొన్నారు. 'మోదీ కేడీ, మోదీ కిలాడి' అంటూ ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు.
షర్మిల మాట్లాడుతూ... రాహుల్ గాంధీపై బీజేపీ, శివసేన నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడితే టెర్రరిస్ట్ అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని... ఉగ్రవాదులకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలయ్యారని చెప్పారు. బీజేపీ, శివసేన మతతత్వ పార్టీలని... ఆ పార్టీల నేతలు మతం మంటలు రేపి అందులో చలి కాచుకుంటారని విమర్శించారు. రాహుల్ అడిగిన ప్రశ్నలను సమాధానాలు చెప్పే ధైర్యం బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు.