Revanth Reddy: నేను ఫామ్ హౌస్ సీఎంను కాను: రేవంత్ రెడ్డి

I am not farm house CM says Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత తెలంగాణ ప్రజలదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానమని చెప్పారు. విలీనం, విమోచనం అంటూ స్వప్రయోజనాల కోసం యత్నించడం సరికాదని అన్నారు. నియంత నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని ఆనాడు భరోసా ఇచ్చామని... పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం తరపున పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నామని సీఎం తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. గత పదేళ్లగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తుంటే... తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లడానికైనా తాను సిద్ధమని అన్నారు. తాను ఫామ్ హౌస్ సీఎం కాదని... పనిచేసే సీఎంనని చెప్పారు.    

"తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. ఆ పిడికిలి పోరాటానికి సంకేతం. తెలంగాణలో అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం అందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్‌ 17ను కొందరు వివాదాస్పదం చేయడం మంచిది కాదు. 

ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ. పరిపాలనలో, ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తుంటాయి. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుంది. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు. వారి ఆలోచనలే మా ఆచరణ. వారి ఆకాంక్షలే మా కార్యాచరణ” అని సీఎం చెప్పారు. 

జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా, సంక్షిప్త నామాన్ని టీజీగా మార్చడం, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ, గద్దర్ పేరిట అవార్డులు, మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును ఖరారు చేయడం వంటి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి చేపట్టిన అనేక చర్యలను ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు.

Go Back to Shorts
Revanth Reddy
Congress
KCR
BRS

More Telugu News