హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతున్నారు: కూల్చివేతలపై కిషన్ రెడ్డి

Kishan Reddy responds on demolitions
  • ప్రభుత్వాలే అనుమతులిచ్చి ప్రభుత్వాలే కూల్చివేస్తున్నాయని విమర్శలు
  • పన్నులు వసూలు చేసి, రోడ్లు వేసి... ఇప్పుడు ఉత్సాహం వచ్చిందని కూల్చేస్తున్నారని వ్యాఖ్య
  • అక్రమ కట్టడాలపై చర్చ జరగాలన్న కేంద్రమంత్రి
ఎన్ కన్వెన్షన్‌తో పాటు హైదరాబాద్ నగరంలో ఆక్రమణల కూల్చివేతలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా ఆడుతోందని విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి... ఇప్పుడు ప్రభుత్వమే కూల్చివేయడం విడ్డూరమన్నారు. అసలు అప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.

అక్రమ కట్టడాలపై సమగ్ర చర్చ జరగాల్సి ఉందన్నారు. అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అందరికీ వర్తింప చేయాలన్నారు. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తామంటే కుదరదన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా చెరువులు, కుంటలను ఆక్రమించుకునేలా పాలన చేశాయని, ఇప్పుడేమో కూల్చివేస్తున్నాయని విమర్శించారు.

ఎన్ కన్వెన్షన్‌తో పాటు అనేక నిర్మాణాలపై ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. వాటన్నింటికీ ఇవే ప్రభుత్వాలు నీళ్లు ఇచ్చాయని, పన్నులు వసూలు చేశాయని, రోడ్లు వేశాయని గుర్తు చేశారు. కానీ ఈ రోజు ఏదో ఉత్సాహం వచ్చిందని కూల్చేస్తామని అంటే ఎలా? అని అన్నారు. అక్రమ నిర్మాణాలపై సమగ్ర చర్చ జరగాలన్నారు.
Go Back to Shorts
HYDRA
G. Kishan Reddy
BJP
Telangana

More Telugu News