Revanth Reddy: ఈరోజు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

CM Revanth Reddy will leave for Delhi today night
  • పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం
  • రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఆహ్వానం
  • వరంగల్ కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్న టీ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈరోజు రాత్రి 11 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీతో కలిసి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమై... పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సింఘ్వీ ఎన్నికపై చర్చించనున్నారు.

సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆహ్వానించనున్నారు. అలాగే, రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేసినందున వరంగల్‌లో నిర్వహించనున్న కృతజ్ఞత సభకు హాజరు కావాలని రాహుల్ గాంధీని కోరనున్నారు. ఎనిమిది నెలల కాలంలో పాలన, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, ఆరు గ్యారెంటీలు తదితర అంశాలపై చర్చించే అవకాశముంది.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News