మంచిని స్వీకరిస్తా... చెడును వదిలేస్తానంటున్న అందాలభామ కీర్తి
- అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన కీర్తి సురేశ్
- రెమో లాంటి స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నానని వ్యాఖ్య
- బేబీ జాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నట్టు వెల్లడి
ఓ ప్రశ్నకు కీర్తి సురేశ్ ఇచ్చిన సమాధానం అభిమానులను ఆకట్టుకోవడమే కాక చాలా మందికి స్పూర్తిని ఇచ్చేదిగా ఉందనే టాక్ వినబడుతోంది. ఇంతకూ అదేమిటంటే .. విమర్శలు, ప్రతికూల పరిస్థితులపై ఆమె సమాధానం ఇస్తూ మంచిని మాత్రమే తీసుకుని చెడ్డ విషయాలను ఎప్పటికప్పుడు విడిచిపెట్టాలని అన్నారు. సహజంగా సినీ ఇండస్ట్రీలో నటీ నటులపై విమర్శలు వస్తూ ఉంటాయి. దీనిపై కీర్తి సురేశ్ స్పోర్టివ్ గా ఇచ్చిన జవాబు అభిమానులను ఆకట్టుకుంది. ఇకపోతే.. తన పేరును వెండితెరపై తొలిసారిగా చూసిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పుకొచ్చారు. టీమ్ చూపిన ప్రేమ తనకు రఘుతాత విషయంలో బాగా నచ్చిందని అన్నారు.
నటుడు వరుణ్ ధావన్ ను లవర్ బాయ్ గా అభివర్ణించారు కీర్తి సురేశ్. రఘుతాతలో పెళ్లి సన్నివేశం ఇష్టమైనదిగా పేర్కొన్నారు. తమిళ్ లో రివాల్వర్ రీటా అనే కొత్త సినిమాలో నటిస్తున్నట్లుగా చెప్పారు. బేబీ జాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నానని చెప్పిన కీర్తి .. తన స్నేహితుడు అట్లీ సినిమా తేరీకి అది రీమేక్ అని తెలిపారు. కాలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని చెప్పారు. తనకు ఇష్టమైన సినిమాల్లో రెమో ఒకటని, అలాంటి స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నానని అన్నారు. అనుష్క శెట్టి చాలా మంచి వ్యక్తి అని కితాబునిస్తూ తనను స్వీటీ అనే పిలుస్తానని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చారు.