Chandrababu: నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu to meet Prime Minister Home minister tomorrow
  • బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి చంద్రబాబు
  • గురువారం ప్రధానితో సమావేశం 
  • విభజన హామీలు సహా పలు అంశాల్లో కేంద్ర సహకారం కోరనున్న బాబు
  • వచ్చే బడ్జెట్‌లో ఏపీకి మేలు చేకూర్చే కేటాయింపులకు విజ్ఞప్తి చేసే ఛాన్స్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 7.25 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఆ తరువాత హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక టీడీపీ అధినేత ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. 

ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, సంబంధిత శాఖ మంత్రులను విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబు వెంట వెళ్లనున్నారు.
Chandrababu
Narendra Modi
Amit Shah
Andhra Pradesh

More Telugu News